తెలంగాణలో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుపై సుప్రీంకోర్టులో బుధవారం విచారణ జరిగింది. ఈ కేసులో తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
ధర్మాసనంలో జస్టిస్ జోయ్మాల్యబాగ్జి, జస్టిస్ వి. మోహనా కూడా ఉన్నారు. తమపై నమోదైన ఏసీబీ కేసు చెల్లదని రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య తమ పిటిషన్లలో పేర్కొన్నారు.
ఈ వ్యవహారం ఎన్నికలకు సంబంధించినదని, దీనిపై విచారణ జరిపే అధికారం ఏసీబీకి లేదని వారి తరఫు న్యాయవాదులు వాదించారు. ఈ కేసును అవినీతి, లంచం వ్యవహారంగా కాకుండా ఎన్నికల కేసుగా పరిగణించాలని కోరారు.
2021లో కేసు నమోదైన సమయంలో అమల్లో ఉన్న చట్టాలను ప్రస్తావిస్తూ, అప్పటి నిబంధనల ప్రకారం ఏసీబీకి ఎన్నికల వ్యవహారంలో జోక్యం చేసుకునే అధికారం లేదని పిటిషనర్ల తరఫు వాదనలు వినిపించారు. అలాగే, అప్పటి చట్టం ప్రకారం లంచం ఇవ్వడం నేరం కాదని కూడా వారు పిటిషన్లో పేర్కొన్నారు.
గతంలో ఈ కేసుపై పలుమార్లు విచారించిన ధర్మాసనంలోని న్యాయమూర్తులు పదవీ విరమణ చేయడంతో ప్రస్తుత ధర్మాసనం విచారణ చేపట్టింది. బుధవారం విచారణ ముగియగా, తదుపరి విచారణ తేదీని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ఖరారు చేయనుంది.












